పేజీలు

30, డిసెంబర్ 2015, బుధవారం

దేవుని ప్రసాదాలంటే నిర్లక్ష్యమా.. దోషాలు తప్పవు జాగ్రత్త!!

దేవుని ప్రసాదాల పట్ల నిర్లక్ష్యంగా ఉన్నారా? కుంకుమ, పుష్పాలను ఇంటికి తీసుకొచ్చి.. ఎక్కడంటే అక్కడ పడేస్తున్నారా? అయితే జాగ్రత్త పడండి. లేదంటే ఈ ధోరణి దోషంగా మారి ఇబ్బందులకు గురిచేస్తుందని ఆధ్యాత్మిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. 
 
దేవాలయంలో భగవంతుడిని దర్శించుకుని పూజ చేయడం.. భగవంతుడి ప్రసాదంగా అర్చకుడు ఇచ్చిన కుంకుమ, పుష్పం, తీర్థ ప్రసాదాలు తీసుకోవడం జరుగుతుంది. ఇక దేవాలయానికి వెళ్లి వస్తూ ఎదురుపడిన వాళ్లు అక్కడి ప్రసాదాన్ని ఇస్తే, ఇంటికి రాగానే దానిని ఎక్కడో ఒకచోట పెట్టి మరిచిపోవడం చేస్తుంటారు.
 
భగవంతుడి కోసం సమయాన్ని కేటాయించకపోవడం, ప్రసాదాన్ని పవిత్రంగా భావించకపోవడం వంటివి ఓ రకంగా ఆయనను అవమానపరచడమే అవుతుందని, ఇది దోషంగా మారే ప్రమాదముందని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు.
 
ఇలాంటి ప్రవర్తన కారణంగా సాక్షాత్తు ఇంద్రుడే ఇబ్బందుల్లో పడినతీరు మనకి పురాణాల్లో కనిపిస్తుంది. ఒకసారి దుర్వాస మహర్షి శ్రీమన్నారాయణుడిని దర్శించుకుని వస్తూ వుండగా, దేవేంద్రుడు తారసపడతాడు. వినయ పూర్వకంగా దేవేంద్రుడు నమస్కరించడంతో, తనకి నారాయణుడు ఇచ్చిన పారిజాత పుష్పాన్ని ప్రసాదంగా ఆయన దేవేంద్రుడికి ఇస్తాడు.
 
ఆ పుష్పాన్ని అందుకున్న వెంటనే దేవేంద్రుడు దానిని 'ఐరావతం' తలపై పెడతాడు. అది చూసిన దూర్వాసుడు ఆగ్రహావేశాలకు లోనవుతాడు. శ్రీమన్నారాయణుడి ప్రసాదం ఏదైనా అది అత్యంత పవిత్రమైనదిగా భావించి స్వీకరించాలనీ, భక్తి భావంతో వ్యవహరించాలని చెబుతాడు.
 
స్వామివారి ప్రసాదానికి ఎవరైతే తగిన ప్రాధాన్యత ఇవ్వకుండా పక్కన పెడతారో, అలాంటివారికి లక్ష్మీదేవి దూరంగా వెళ్లిపోతుందంటాడు. లక్ష్మీదేవి లేని చోటు కళావిహీనమై అనేక కష్ట నష్టాలకు వేదికగా మారుతుందని అంటాడు. 
 
దుర్వాస మహర్షి పలుకుల మేరకు అసురుల కారణంగా ఇంద్రు తన పదవిని కోల్పోతాడు. దేవేంద్రుడు కొంతకాలం పాటు నానాఇబ్బందులు పడతాడు. ఆ తరువాత స్వామివారికి క్షమాపణ చెప్పుకుని తిరిగి పూర్వ వైభవాన్ని పొందుతాడు.
 
అందువలన భగవంతుడి ప్రసాదంగా లభించినది ఏదైనా దానిని ఎంతో పవిత్రమైనదిగా భావించాలని ఎలాంటి పరిస్థితుల్లో నిర్లక్ష్యం వహించకూడదని పండితులు సూచిస్తున్నారు. ప్రసాదాన్ని భవ్యంగా స్వీకరించడం ద్వారా స్వామి వారి అనుగ్రహంతో సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయని పండితులు చెబుతున్నారు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి